అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా అందజేసిన రేగొండ ఎస్సై
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని 4వ అంగన్వాడీ కేంద్రానికి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) డి.సుధాకర్ – స్పందన దంపతులు శుక్రవారం వినూత్న రీతిలో తమ ఉదారతను చాటుకున్నారు.అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారి బాలబాలికల సౌకర్యార్థం వారు 15 ప్లాస్టిక్ కుర్చీలను విరాళంగా అందజేశారు.ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు నేలపైనే కూర్చుని అక్షర జ్ఞానాన్ని నేర్చుకునేవారని,ఇప్పుడు ఎస్సై దంపతుల చొరవతో తమకు కుర్చీలు సమకూరడంపై చిన్నారులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కుర్చీలపై కూర్చుని చదువుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చిన్నారులు మురిసిపోయారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రజిత మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి, చిన్నారుల పౌష్టికాహారానికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడుగా సమాజంలోని దాతలు కూడా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరిన్ని మెరుగైన వసతులు కల్పించవచ్చని ఆమె పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్పందించి, వసతుల కల్పనకు తోడ్పడిన ఎస్సై సుధాకర్ – స్పందన దంపతులకు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి స్థానిక దాతలు, చిన్నారుల తల్లిదండ్రులు తమ వంతు సామాజిక బాధ్యతగా సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ శ్రీలత, మహిళా సంఘం అధ్యక్షురాలు సుమలత,చిన్నారుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.