స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ శిక్షణ కార్యక్రమం
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (ఎస్ ఏ టీ జి) ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ అనుమతి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్” మొబైల్ శిక్షణ కార్యక్రమం ఈ నెల 11వ తేదీన (శనివారం) జిల్లా కేంద్రంలో జరగనుంది.కృష్ణ కాలనీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్ఓ) సిహెచ్.రఘు ఒక ప్రకటనలో తెలిపారు.గ్రామీణ,పట్టణ స్థాయిల్లో క్రీడలను మరింత ప్రోత్సహించడానికి, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సరికొత్త శిక్షణా విధానాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన వివరించారు.రాష్ట్ర స్థాయి నుండి నామినేట్ చేయబడిన ప్రత్యేక ఇన్-చార్జ్ కోచ్లు, క్రీడా నిపుణులు, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్లు ఈ శిక్షణలో పాల్గొని సరికొత్త క్రీడా నైపుణ్యాలు, ఆధునిక శిక్షణా పద్ధతులు, క్రీడాకారుల మానసిక దృఢత్వం,ఫిట్నెస్ సూత్రాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ (జడ్పీ), ప్రైవేట్ పాఠశాలల మరియు కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు (పిడిస్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పి ఈ టి స్) ఈ శిక్షణా కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని డీవైఎస్ఓ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన పీడీలు, పీఈటీలకు ఆ రోజును “ఆన్ డ్యూటీ” (ఓడి) గా పరిగణించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.ఆధునిక క్రీడా మెళకువలను తెలుసుకోవడానికి ఇదొక సువర్ణావకాశమని,జిల్లాలోని పీడీలు, పీఈటీలతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు,సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ విద్యార్థులు (బీపీఈడీ, డీపీఈడీ) అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ శిక్షణను విజయవంతం చేయడంతో పాటు సద్వినియోగం చేసుకోవాలని రఘు కోరారు.