ఓటరు నమోదు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు.శుక్రవారం న్యూఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ల సవరణ కార్యక్రమం పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు జాబితాలో పారదర్శకత అత్యంత కీలకమని, ప్రతి ఎన్నికకు ముందు జాబితాను తప్పులు లేకుండా నవీకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని, ఇంటింటి సర్వేలు, బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) పనితీరును మెరుగుపరచాలని సూచించారు. ఓటరు జాబితాలో నూతన పేర్ల నమోదు, తొలగింపు, సవరణ ప్రక్రియలను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలన్నారు.మిగిలిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేసి, ఈ నెల 24వ తేదీ నాటికి డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. తగిన విచారణ జరపకుండా ఏ ఒక్క ఓటరు పేరును జాబితా నుండి తొలగించకూడదని,అర్హులైన ఏ పౌరుడూ ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుది జాబితాపై అభ్యంతరాలు ఉంటే జిల్లా మేజిస్ట్రేట్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని, అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 99.6 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని,21.94 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 99.52 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, 37.36 శాతం డిజిటలైజేషన్ జరిగిందని వివరించారు. మ్యాపింగ్ చేసిన డాటా ఆధారంగా ఫారాలను సరిచూసుకుని, జూలై 24 నాటికి డిజిటలైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు అదనపు సహాయకులను నియమిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో నిరంతర పర్యవేక్షణ చేయిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు విజయలక్ష్మి, అబ్బాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.