చికాగో అమరవీరులకు జోహార్లు
కార్మిక హక్కుల సాధనకు పోరాడుదాం
•హమాలీ యూనియన్ అధ్యక్షుడు మంద భాష్కర్
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 141వ మే డే సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఇల్లంద) ఆవరణలో హమాలీ యూనియన్ అధ్యక్షులు మంద భాష్కర్ అరుణ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”అమెరికాలోని చికాగోలో కార్మికులు చిందించిన రక్తంతో,త్యాగాలతో సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థను అంతం చేసి సమ సమాజాన్ని సాధించేందుకు శ్రమజీవులంతా ప్రతిన బూనాలి” అని పిలుపునిచ్చారు.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి పాలకులు తుంగలో తొక్కి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు.స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయకుండా, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతుల ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేసి దాని స్థానంలో విబి జి రాంజీ చట్టాన్ని తెచ్చి కోట్లాది వ్యవసాయ కూలీల నోట్లో మట్టి కొడుతోందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో ప్రజల బతుకులు దుర్భరంగా మారాయని, చేనేత, గీత, మత్స్య, గొర్రెల పెంపకం, రజక, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి తదితర చేతివృత్తిదారుల వృత్తులు కనుమరుగై ప్రత్యామ్నాయ ఉపాధులు లేక ఆకలి చావులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక, కర్షకులు, శ్రమజీవులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు భుజం భుజం కలిపి నయా బానిసత్వానికి వ్యతిరేకంగా, సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పర్కాల బాబు, ఏఐసీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు, చీకటి సూరయ్య, చీకటి సదానందం, మంద సాయిలు, మంద కుమార్, అబర్ల కుమార్, మైదం సంబరాజు, హమాలీ సభ్యులు పాల్గొన్నారు.