
– నాగరత్న సేవా సంఘం హర్షం
ఈ69 న్యూస్ జనగామ, జూన్ 27
జనగాం జిల్లాకు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంపై నాగరత్న సేవా సంఘం హర్షం వ్యక్తం చేసింది.సంఘం ప్రతినిధి బిర్రు ఇస్తారి మాట్లాడుతూ, గతంలో జనగాంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. వినతిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలపై నివేదిక కోరినట్లు తెలిపారు.ఆ ప్రయత్నాల ఫలితంగానే జనగాం జిల్లాకు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ మంజూరవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కేంద్రం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్, మార్గదర్శకత్వం అందుబాటులోకి రావడంతో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను త్వరితగతిన ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నాగరత్న సేవా సంఘం కోరింది.అలాగే ఈ ప్రక్రియకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అప్పటి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్కు సంఘం కృతజ్ఞతలు తెలిపింది.