టీఆర్పీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ
ఐదు వార్డులకు అధికారిక అభ్యర్థుల ప్రకటన
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డులకు గాను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థులకు శుక్రవారం అధికారికంగా బీ-ఫారాలు అందజేశారు. టీఆర్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాలు, రాష్ట్ర కమిటీ మార్గదర్శకాల మేరకు జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు.
10వ వార్డు అభ్యర్థిగా అవధూత కవిత,18వ వార్డు అభ్యర్థిగా గాజ వేణుగోపాల్,22వ వార్డు అభ్యర్థిగా కౌటం సౌమ్య,28వ వార్డు అభ్యర్థిగా ఇనుగాల ప్రణయ్ రాజ్, 29వ వార్డు అభ్యర్థిగా మామిడి శ్రీకాంత్ ఎంపికైనట్లు తెలిపారు.రవి పటేల్ మాట్లాడుతూ,తెలంగాణలో బహుజనుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతోందని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఇతర పార్టీల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు మన పార్టీ నుంచే బహుజన వర్గాల అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయడం గర్వకారణమని పేర్కొన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన టీఆర్పీ పార్టీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి టీఆర్పీ పార్టీ అభ్యర్థులు ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధిదీపాలు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు సంతోష్, శ్రీకాంత్, సిద్దు, జస్వంత్, కోటేష్, ఇతర నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు