డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు పెంచాలి
- ఎడిషన్ సెంటర్లకు నాలుగు కార్డుల విధానం సరికాదు
- గతంలో మాదిరి అందరికీ కార్డులు ఇవ్వాలి
- డెస్క్ జర్నలిస్టుల మధ్య అంతరాలు సృష్టించే చర్యలను ఖండిస్తున్నాం
- టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి, డీజేఎఫ్ టీ ఖమ్మం జిల్లా అడ్ హక్ కార్యదర్శి అచ్చిరెడ్డి
- కలెక్టర్ అనుదీప్ కు వినతి… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ
- డెస్క్ జర్నలిస్టులకు గతంలో మాదిరి అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్ టీ) ఖమ్మం జిల్లా అడ్ హక్ కమిటీ కార్యదర్శి కేతిరెడ్డి అచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేసే చర్యలను ఖండించాలని కోరారు. డీజేఎఫ్ టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టికి వినతి పత్రం సమర్పించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీనికి ముందు డీ జే ఎఫ్ టీ తో కలిసి, టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.
- డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేయొద్దు..
- డెస్క్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గించి అన్యాయం చేయొద్దని ఖదీర్, శ్రీనివాసరెడ్డి, అచ్చిరెడ్డి కోరారు. జీవో 252 ద్వారా అక్రిడిటేషన్లను పెంచుతున్నట్టే పెంచుతూ.. రకరకాల కొర్రీలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల కుదించటాన్ని తీవ్ర అన్యాయంగా పరిగణిస్తున్నామని తెలిపారు. డెస్క్ జర్నలిస్టుల మధ్య అంతరాలు సృష్టించే విధంగా అక్రిడిటేషన్ల కార్డుల కేటాయింపులు ఉండటం సమంజసం కాదన్నారు. ఇటువంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. గతంలో ప్రతి జిల్లా (33 జిల్లాలు)కు ఐదుగురికి, ఎడిషన్ జర్నలిస్టులందరికీ అడ్రెడిటేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు, కేవలం ఎడిషన్ సెంటర్ కు నాలుగు అక్రిడిటేషన్లు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం దారుణమన్నారు. ఈ నిబంధన వల్ల చాలామంది డెస్క్ జర్నలిస్టులు అక్రెడిటేషన్లకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులు ఎడిషన్ కేంద్రాల్లోనే పనిచేసినా ఏ జిల్లాకు ఆ జిల్లా డెస్కులు వేరువేరుగా ఉంటాయని, ప్రతి జిల్లాకు ఒక ఇన్చార్జితో పాటు సలుగురికి పైగా సబ్ ఎడిటర్లు ఉంటారని చెప్పారు. ఒక్కో ఎడిషన్లో మూడు నుంచి ఆరు జిల్లాలున్నాయని వాటికి అనుగుణంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో ప్రకారం ఎడిషన్ కు నాలుగు కార్డులే ఇస్తే కనీసం ఆ జిల్లాల ఇన్చార్జిలకు కూడా అక్రెడిటేషన్లు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అక్రిడిటేషన్ లు లేని కారణంగా డెస్క్ జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని, విధులు ముగించుకొని అర్ధరాత్రి ఇండ్లకు చేరే డెస్క్ జర్నలిస్టులకు ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి ఉందని, అలాంటప్పుడు వారికి అక్రిడిటేషన్లు లేకపోతే రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రకరకాల కొర్రీలతో అక్రిడిటేషన్లు కుదించటం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎలాంటి కొర్రీలు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.
- ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, సహాయ కార్యదర్శి కూరాకుల గోపి, టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఫయాజ్, గణేష్, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం నియోజకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు తురగ రాఘవేంద్ర మూర్తి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎన్. మధుశ్రీ, జానీపాష, డీజేఎఫ్ టీ నాయకులు వీసారపు అంజయ్య, బంకా వెంకటేశ్వర్లు, ఉపేంద్ర, ప్రసాద్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు చింతకాని ప్రసాద్, అర్షద్, గోపీ, షకీల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.