ప్రకృతి గర్భగుడి
మన హృదయం ప్రకృతి గర్భగుడిగా మారిన వేళ,
వర్షపు చినుకులు అభిషేకాలై జలజలా కురిశాయి.
గాలుల సున్నిత నాదం మంత్రోచ్ఛారణై పలికిన వేళ,
పక్షుల గానధారలు ఘంటానాదాలై మార్మోగాయి.
భూమి ఒడిలో మొలిచిన ప్రతి పచ్చ మొగ్గ,
దైవసాన్నిధ్యపు మౌన ప్రతిమగా నిలిచింది.
సూర్యకిరణాలు హారతులై వెలుగులు చిందించగా,
చంద్రకాంతి కరుణా ప్రసాదంలా జాలువారింది.
కానీ —
మనిషి మనసులో మొలిచిన స్వార్థపు ముళ్లు
ఆ ప్రకృతి గర్భగుడిని గాయపరిచాయి.
అసూయ అనే అగ్నికణం ఎగసి పడిన వేళ
హృదయ పవిత్రత బూడిదగా మారింది.
అహంకారం అనే అంధకారం కమ్ముకున్నప్పుడు
ఆత్మదీపం మసకబారింది.
ద్వేషం అనే విషగాలి వీచిన క్షణంలో
జీవన వనమే వాడిపోయింది.
అడవులను నరికిన కత్తుల ధ్వని
మనిషి ఊపిరినే మూలం నుంచి కోసేసింది.
పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూ
ప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.
మన హృదయం మళ్లీ పవిత్రమైతేనే
ప్రకృతి గర్భగుడి తిరిగి వెలుగుతుంది.
మన ప్రేమే హారతి, మన కరుణే పూజగా మారితే
ఈ భూమి మళ్లీ దైవాలయంగా వికసిస్తుంది.
పకృతిని కాపాడాలని కోరుకుంటూ…
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218