మామునూరు ఎయిర్పోర్ట్ భూముల అప్పగింత
బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి అవసరమైన 949 ఎకరాల భూమిని కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గురువారం అందజేశారు.మామునూరు ఎయిర్పోర్టుకు అదనంగా అవసరమైన 253 ఎకరాల భూ సేకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించింది.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ.. కాకతీయుల వారసత్వాన్ని కలిగిన వరంగల్కు విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. వరంగల్ ప్రజల చిరకాల కోరిక అయిన మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఈ రోజు కీలకమైన ముందడుగు పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 200 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన అదనపు భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీకి అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇది వరంగల్ చరిత్రలో నిలిచిపోయే రోజు అని వ్యాఖ్యానించారు.
మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే వరంగల్ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతుందని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వ్యాపార, పర్యాటక రంగాలు మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లు నిధులు కేటాయించిందని, ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో మామునూరు ఎయిర్పోర్ట్ అంశాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ వేగంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రెండు నుంచి రెండున్నర సంవత్సరాల లోపు మామునూరు ఎయిర్పోర్ట్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ ప్రజల చిరకాల కోరిక నెరవేరే దిశగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ డా. కడియం కావ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.