యాదగిరి నగర్ బస్తీ దవాఖానలో తీవ్ర సమస్యలు
హైదరాబాద్ ఏజీ కాలనీ డివిజన్ పరిధిలోని యాదగిరి నగర్ బస్తీ దవాఖానలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ దవాఖానను పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.పరిశీలనలో బస్తీ దవాఖానలో పలు లోపాలు బయటపడ్డాయి.ముఖ్యంగా షుగర్ రోగులకు అవసరమైన హెచ్బిఎ1సి పరీక్షలు నగరవ్యాప్తంగా నిలిచిపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే ఈ పరీక్షలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే థైరాయిడ్ రోగులకు అవసరమైన మందులు నిరంతరంగా అందుబాటులో ఉంచాలని కోరారు.దవాఖానలో తాగునీటి సౌకర్యం లేకపోవడం, బాత్రూమ్లలో నీరు రాకపోవడం, పైప్లైన్లో ఎలుకలు మట్టితో నింపేయడం వంటి సమస్యలు రోగులు, సిబ్బందికి ఇబ్బందిగా మారాయని తెలిపారు.ప్రధాన ద్వారం విరిగిపోవడం వల్ల భద్రతా లోపాలు ఉన్నాయని, వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. భవనం పైభాగంలోని మెట్ల వద్ద గేట్ ఏర్పాటు చేసి అనవసర ప్రవేశాలను నిరోధించాలని అన్నారు.ప్రజా సమస్యల యాత్రలో భాగంగా మార్చి 1 నుంచి 20 వరకు ఈ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటున్నట్లు రాపర్తి అశోక్ తెలిపారు.సమస్యలు పరిష్కరించకపోతే బస్తీ ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వై. యాదగిరి, కె.యాదగిరి, ఎండి. అసిఫ్, కిరణ్, కిరణ్ కుమార్, అమృత, భావన, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.