వీర్ బాల్ దివాస్ సందర్భంగా సాహిబ్జాదాలకు బీజేపీ నేతల ఘన నివాళులు
వీర్ బాల్ దివాస్ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు.జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిక్ఖు గురువు గురు గోబింద్ సింగ్ జీ కుమారులు సాహిబ్జాదాల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిక్ఖు ధర్మ రక్షణతో పాటు దేశ గౌరవాన్ని కాపాడేందుకు చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన బాబా అజిత్ సింగ్ జీ, బాబా జుఝార్ సింగ్ జీ, బాబా జోరవర్ సింగ్ జీ, బాబా ఫతే సింగ్ జీ భారత చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచారని పేర్కొన్నారు. వారి త్యాగం ఒక కుటుంబానికే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు.సత్యం, న్యాయం, ధర్మం కోసం సాహిబ్జాదాలు చూపిన ధైర్యం నేటి యువతకు గొప్ప ఆదర్శమని పేర్కొంటూ, స్వార్థాన్ని త్యజించి దేశం కోసం జీవించడమే నిజమైన దేశభక్తి అని వారి త్యాగం మనకు బోధిస్తోందని కీర్తి రెడ్డి తెలిపారు.వారి జీవితాలు ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని, సమాజ సేవలో, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.డిసెంబర్ 26ను వీర్ బాల్ దివాస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, సాహిబ్జాదాల త్యాగాన్ని యావత్ దేశానికి గుర్తు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.వీర్ బాల్ దివాస్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో దేశభక్తిని మరింత బలపరుస్తాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.