
ఈ69 69 న్యూస్ హన్మకొండ/హసన్పర్తి, జూలై 1
హసన్పర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హసన్పర్తి ఇన్స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ, పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ మోసాలు కూడా కొత్త రూపాల్లో జరుగుతున్నాయని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. ఆన్లైన్ ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.వెంటనే స్పందిస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.అలాగే డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని, అవి యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొన్నారు.గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే 1908 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.