పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
•ప్రీ ప్రైమరీతో ప్రభుత్వ బడులు బలపడతాయి
•పర్వతగిరి విద్యాశాఖ సమీక్ష సమావేశం వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి ఏ. భిక్షపతి అధ్యక్షతన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పర్వతగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాలోత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రధానోపాధ్యాయులందరూ కృషి చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం అనుమతించిన ప్రీ ప్రైమరీ తరగతుల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మరింత బలపడతాయని పేర్కొన్నారు.
మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నమోదు పెంచాలని,నూతన ప్రీ ప్రైమరీ తరగతుల్లో కనీసం 25 మంది విద్యార్థులు ఉండేలా చూడాలన్నారు.మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ ఆన్లైన్ పనులు సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.వైద్యాధికారి డాక్టర్ వి. ఉదయ్ రాజ్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన,సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.ఈ సమావేశంలో పర్వతగిరి సముదాయ ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్,మండల విద్యా వనరుల కేంద్ర సిబ్బంది,అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.