సారంపల్లి మల్లారెడ్డి లాంటి గొప్ప ప్రజా నాయకున్ని కోల్పోవడం అత్యంత బాధాకరం

ఈ69 న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 25
రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మృతి దేశ రైతాంగ ఉద్యమానికి తీరని లోటని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సీపీఎం కార్యాలయం ఎంబీ భవన్లో ఉంచిన సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయానికి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..జీవితాన్నే పోరాటంగా భావించి ప్రతి క్షణం వ్యవసాయరంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం పరితపించిన నిబద్ధత కలిగిన రైతు ఉద్యమ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని కొనియాడారు.అఖిల భారత రైతు సంఘం నాయకుడిగా, కమ్యూనిస్టు నేతగా రైతాంగ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని గుర్తుచేశారు.రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని అన్నారు.1987లో తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి సారంపల్లి మల్లారెడ్డి తన వెన్నంటే ఉంటూ అన్ని విధాలుగా ప్రోత్సహించిన వారిలో అత్యంత ప్రథముడని కడియం శ్రీహరి తెలిపారు. మల్లారెడ్డితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని, ప్రతి ఉద్యమంలో తనను కన్వీనర్గా ముందు వరుసలో నిలిపి రాజకీయంగా ఎదిగేందుకు ఆయన ఎంతో సహకరించారని గుర్తుచేసుకున్నారు.సారంపల్లి మల్లారెడ్డి లాంటి గొప్ప ప్రజా ఉద్యమ నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని కడియం శ్రీహరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత రైతాంగ ఉద్యమానికి, సీపీఎం పార్టీకి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు.సారంపల్లి మల్లారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కడియం శ్రీహరి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.