ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
హన్మకొండ జిల్లా గుండ్ల సింగారం పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలసిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాలనీవాసులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు వినతిపత్రం సమర్పించారు.శుక్రవారం హన్మకొండలో మంత్రిని కలిసిన ఆలయ కమిటీ సభ్యులు,స్థానికులు, ఆలయం ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.కాలనీలోని భక్తులకు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ ఆలయానికి తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు వివరించారు.ముఖ్యంగా ఆలయ భద్రత దృష్ట్యా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం అత్యవసరమని, అలాగే పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని మంత్రికి విజ్ఞప్తి చేశారు.ఆలయ పునరుద్ధరణ, ఇతర నిర్మాణ పనుల కోసం ప్రభుత్వపరంగా తగిన బడ్జెట్ను కేటాయించాలని కోరారు.కాలనీవాసుల విన్నపంపై మంత్రి కొండ సురేఖ సానుకూలంగా స్పందించారు.ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆమె,ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రహరీ గోడ నిర్మాణం,ఇతర సౌకర్యాల విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.మంత్రిని కలిసిన వారిలో ఎడ్ల రమేష్, భూక్య సిద్దు నాయక్, శీలం అనిల్ కుమార్, రాజ మోహన్, భూక్య కిషన్, చుంచు సాంబయ్య, మద్దికుంట్ల శ్రీనివాస్, భూక్య అభినాయక్, మద్దికుంట్ల అఖిల్, కోరిక వరుణ్ నాయక్, సురేష్ కుమార్, బమ్మెర్ల పోశెట్టి, భూక్య సృజన్ తదితరులు పాల్గొన్నారు.తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రికి ఈ సందర్భంగా కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.