
21.12.2022** !!****డిసెంబర్ 26న జరిగే భారీబహిరంగ సభను జయప్రదం చేయండి !!!**—————————–(ఎన్పిఆర్డి జనగామ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేష్ లు పిలుపు.)రాష్ట్రంలో వికలాంగుల పింఛన్ 10 వేలకు పెంచాలని, వికలాంగులకు వికలాంగుల బందు, వికలాంగుల భీమా పథకాలు ప్రకటించాలని, వికలాంగుల ఉద్యోగాల భర్తీ, వికలాంగుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ తదితర వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 26న ఇందిరాపార్క్ వద్ద జరిగే బహిరంగ సభకు వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎన్పిఆర్డి జనగామ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేష్ లు పిలుపునిచ్చారు. దివి: 21-12-2022 బుధవారం రోజున జనగామ పట్టణంలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోట సురేందర్ అధ్యక్షతన ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభల వాల్ పోస్టర్ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు గారు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో టీఆరెఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు వికలాంగుల పింఛన్ రూ. 3016/- ఇస్తున్నారన్నారు. వికలాంగుల సంక్షేమం, సాధికారిత లక్ష్యంగా కేసిఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. దళిత బంధు, డబల్ బెడ్రూమ్ ఇండ్లలో వికలాంగులకు 5శాతం వాటా కేటాయించారని తెలిపారు. జనగామ ఏరియా ఆసుపత్రిలో రైల్వే ఫాస్ కోసం ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వికలాంగులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యేక ఓపి లైన్ తోపాటు ఆసుపత్రిలో హెల్త్ చెకప్ కోసం ఒక డాక్టర్ ను కేటాయిస్తున్నామని తెలిపారు. జిల్లా మెడికల్ బోర్డుకు కృషిచేస్తున్నామని, సదరం సర్టిఫికెట్ల ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం సంఘం జనగామ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేష్ లు పాల్గొని మాట్లాడుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా వికలాంగులు ఉన్నారని, వీరిలో కేవలం 11వేల 234 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీల కంటే చాలా వెనుకబడిన సామాజిక వర్గం వికలాంగుల వర్గం అని ఎస్సి, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన దళిత బందు, చేనేత భీమా పథకాల మాదిరిగా వికలాంగులకు వికలాంగుల బందు, వికలాంగుల భీమా పథకాలు ప్రకటిస్తే వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి, సాధికారిత సాధ్యం అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, జిల్లాలో వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు వికలాంగులకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. జీవో నంబర్ 13 ప్రకారం రాష్ట్రంలో వికలాంగులకు ప్రత్యేక రేషన్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా స్కూల్ లలో ర్యాంపులు, సౌకర్యాలు లేకపోవడంతో వికలాంగులు విద్యకు దూరంగా ఉన్నారన్నారు. వికలాంగుల పిల్లలకు విద్యా ప్రత్యామ్నాయాలపై పాలకులకు చిత్తశుద్ది లేదని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానం వల్ల వికలాంగులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉందని అన్నారు.21రకాల వైకల్యాల వారికి వైకల్య ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 6 ఎండ్లు అవుతుందని అమలులో మాత్రం నిర్లక్ష్యం ఉందని, ఈ చట్టాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేట్ పరం చేయడం వల్ల వికలాంగులకు రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని అన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. పేదలపై భారాలు వేస్తు సంపన్నులకు రాయితీలు ఇస్తున్నారని విమర్శించారు. వికలాంగులను అవమానపరిచే ఘటనలు అనేకం జరుగుతున్నాయని, ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్ 10 వేలకు పెంపు, వికలాంగుల బందు వికలాంగుల భీమా పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉచిత విద్యుత్ పథకాల సాధన కోసం డిసెంబర్ 26న హైదరాబాద్ లోని ఇందిరపార్క్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది, 27, 28 తేదీలలో ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలలో వికలాంగుల సమస్యలను, ప్రభుత్వ విధానాలను చర్చించి భవిష్యత్ పోరాటాల ప్రణాళిక రుపొందిస్తామని తెలిపారు. ఈ మహాసభల జయప్రదానికి వికలాంగులు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల కుమార్, స్టేషన్ ఘనపూర్ మండల ఉపాధ్యక్షులు రడపాక యాదగిరి, శివునిపల్లి గ్రామ అధ్యక్షులు పాలకుర్తి విశ్వనాథం, జనగామ పట్టణ నాయకులు రావుల శ్రీనివాస్, ఎండి అన్వర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.