విద్యార్థులపై లాఠీచార్జి బీజేపీ నియంతృత్వానికి నిదర్శనం
నియోజకవర్గ పరిధిలోని
తల్లాడ మండల కేంద్రంలో ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ సిపిఎం తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన పార్లమెంట్ మార్చ్పై కేంద్ర పోలీసు బలగాలు లాఠీచార్జి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఖండించారు.
2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ పాలనలో అనేక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటుచేసుకున్నాయని, కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఈ ఏడాది నీట్ పరీక్షా లీకేజీ కారణంగా సుమారు 32 లక్షల మంది విద్యార్థులు తీవ్ర అనిశ్చితికి గురయ్యారని, పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని విమర్శించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పట్టించుకోకుండా, అనంతరం ఆయనను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.
విద్యార్థులు చేపట్టిన న్యాయమైన పోరాటంపై లాఠీచార్జి చేయడం బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని, ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో: పార్టీ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు చలమాల విఠల్ రావు,అయినాల రామలింగేశ్వరరావు, కొలికపోగు సర్వేశ్వరరావు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్, నల్లమోతు మోహన్రావు, చల్లా నాగేశ్వరరావు, సత్తెనపల్లి నరేష్, వేలాద్రి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.