సామ్రాజ్యవాద యుద్ధాలతో సామాన్యులపై భారం
- వ్యాపార దృక్పథంతోనే అమెరికా యుద్ధం
- అమెరికా ఆర్థిక వ్యవస్థ కూ యుద్ధం ఓ సవాలే..!
- భవిష్యత్తులో తీవ్రం కానున్న ఎరువుల కొరత
- అమెరికా చెప్పినట్లు ఆడుతున్న మోడీ
- సామ్రాజ్యవాద యుద్ధం – ప్రజలపై ప్రభావం’ సెమినార్ లో ఆర్థిక, సామాజిక విశ్లేషకులు డి. పాపారావు, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
- సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్… ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో కాలి బూడిద అవుతున్నది యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్, డ్రోన్స్ మాత్రమే కాదు, మూడో ప్రపంచ దేశాల్లోని కార్మికులు – కర్షకులు, సామాన్యుల శ్రమశక్తి అని ఆర్థిక సామాజిక విశ్లేషకులు డి. పాపారావు పేర్కొన్నారు. దేశీయ ఇంధన అవసరాలను 80% పైగా దిగుమతి పై ఆధారపడడంతో యుద్ధం వలన ప్రధానంగా ప్రభావమవుతున్న దేశాలలో మన దేశం ఒకటి అన్నారు. వ్యాపార దృక్పథంతోనే అమెరికా ఈ యుద్ధం చేస్తోందన్నారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే), ఖమ్మం ఆధ్వర్యంలో స్థానిక మంచికంటి ఫంక్షన్ హాల్ లో శనివారం ఏర్పాటు చేసిన ‘ సామ్రాజవాద యుద్ధం – ప్రజలపై ప్రభావం’ సెమినార్ లో పాపారావు ముఖ్య వక్తగా మాట్లాడారు. హర్మూజ్ జల సంధి మూసివేతతో ఇంధన దిగుమతులతోపాటు పశ్చిమాసియా దేశాలకు ఎగుమతయ్యే ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ప్రభావం పడిందన్నారు. ఫార్మా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల కంటైనర్పై వార్ సెస్ కింద అదనంగా రూ.రెండు లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం తెలంగాణలోని ఉత్పాదక పరిశ్రమల కార్మికులపై ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా ఎల్.ఎన్.జి వంటి ముడి పదార్థాల కొరత ఏర్పడటంతో పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవలసి వస్తోందన్నారు. రసాయనాలు, ప్లాస్టిక్లు, ఆహార ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలు ఉత్పత్తి మందగించాయన్నారు. సిరామిక్, ఉక్కు, వస్త్ర, ఫ్యాబ్రికేషన్ యూనిట్లను పెద్ద ఎత్తున మూసివేయడానికి కారణమవుతోందన్నారు. ఇండస్ట్రియల్ గ్యాసెస్, కెమికల్స్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల కొరతకు దారితీసిందన్నారు. కొన్ని తయారీ యూనిట్లలోని పారిశ్రామిక క్యాంటీన్లు ఇప్పటికే మూతపడ్డాయన్నారు. ఈ అస్థిరత తెలంగాణ నుండి గల్ఫ్ ప్రాంతానికి జరిగే ఎగుమతులకు అంతరాయం కలిగించిందన్నారు. భవిష్యత్తులో ఎరువుల కొరత తీవ్రతరం అవుతుందన్నారు. ఇరాన్ తో యుద్ధానికి దిగేముందే అమెరికా అంచనా గాడి తప్పిందని తెలిపారు. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. సీఎన్జీ కొరతతో అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. విదేశాలకు వెళ్తున్న భారతీయులలో దేశంలోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల నుండి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల కలల సీమలకు వెళ్తున్న వైట్ కాలర్ ఉద్యోగుల కంటే గల్ఫ్ కంట్రీస్లో ఉపాధి పొందుతున్న కార్మికులే అధికమన్నారు. గల్ఫ్ (యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్) దేశాలలో సుమారు తొంభై లక్షలమంది భారతీయ కార్మికులు ఉంటే… తెలంగాణ నుండి సుమారు పదిహేను లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో కీలకమైన ఖరీఫ్ సీజన్కు ముందు యుద్ధం కారణంగా ఖతార్ నుండి ఎల్ఎన్జీ రవాణా నిలిచిపోవడం దేశీయ యూరియా తయారీని ప్రభావితం చేస్తోందన్నారు. యూరియా ఉత్పత్తిలో డెబ్బయి శాతం వ్యయం సహజ వాయువుదేనని తెలిపారు. రామగుండం పెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సిఎల్)పై గ్యాస్ కొరత ప్రభావం పడిందన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ యూరియా ఉత్పత్తిలో దాదాపు సగభాగం రాష్ట్రానికే సరఫరా అవుతుందన్నారు.
- దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి ఇరాన్ సహజ వాయువును పైప్లైన్ ద్వారా తీసుకువచ్చే ప్రాజెక్టును అమెరికా ఆంక్షల కారణంగా భారతదేశం వైదొలిగిందన్నారు. ప్రాజెక్టు నుండి వైదొలగకుండా పైప్ లైన్ పూర్తి చేసి ఉంటే, నేడు ఎంతో చౌక ధరకు ఇరాన్ నుండి సహజవాయువు మనకు అందేదని చెప్పారు. ప్రపంచ ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపించేది కమ్యూనిస్టులు మాత్రమే తెలిపారు. భవిష్యత్ కమ్యూనిస్టులు దేనిని అన్నారు.
- అమెరికా చేతిలో మోడీ కీలుబొమ్మ
భారతదేశ పాలకవర్గాలు అమెరికన్ సామ్రాజ్యవాదానికి లొంగిపోతున్న కారణంగా నేడు దేశంలోని కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. వ్యాపార, వాణిజ్య రంగంలో శతాబ్దాలుగా ఇరాన్తో భారత్కు అనుబంధం ఉందన్నారు. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్నాయని తెలిపారు.
దీనికి భిన్నంగా ప్రస్తుత బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్, అమెరికన్ సామ్రాజ్యవాదంతో అంటకాగుతోందన్నారు. మన ప్రభుత్వం ఏం చేయాలో, ఎక్కడ సంతకం పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో అమెరికా నిర్ధారిస్తుందన్నారు. బీవీకే జనరల్ మేనేజర్ వై . శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.