చలో ఢిల్లీ పిలుపు–విశ్రాంత బొగ్గు కార్మికుల దేశవ్యాప్త ధర్నాకు సిద్ధం
బొగ్గు పరిశ్రమల్లో సేవలు అందించి పదవీ విరమణ పొందిన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న ఢిల్లీలో నిర్వహించనున్న దేశవ్యాప్త ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కాడర్ల ప్రకాష్ మాట్లాడుతూ, 1998 నుండి అమలులో ఉన్న పెన్షన్ వ్యవస్థలో గత దాదాపు 20 సంవత్సరాలుగా ఎలాంటి పెంపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో పెన్షన్ తక్కువగా ఉండటంతో విశ్రాంతి కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.కనీస పెన్షన్ను రూ.15,000కు పెంచడంతో పాటు, డీఏతో కలిపి 50 శాతం పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి పరిధిలోనే నెలకు రూ.500 నుండి రూ.1000 వరకు మాత్రమే పెన్షన్ పొందుతున్నవారు దాదాపు 10 వేల మంది ఉన్నారని ఆయన వివరించారు. అలాగే సి పి ఆర్ ఎం ఎస్ (మెడికల్ సదుపాయాల నిధి) పరిమితిని రూ.8 లక్షల నుండి రూ.25 లక్షలకు పెంచాలని కోరారు.సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఢిల్లీలో జరిగే ఈ ధర్నాకు హనుమకొండలో కూడా సంఘీభావం తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.ఇందుకు విశ్రాంతి సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి నలబాల దామోదర్, ఎస్.కె హసన్ తదితర నాయకులు కూడా మద్దతు ప్రకటిస్తూ విశ్రాంతి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.మొత్తం మీద విశ్రాంతి బొగ్గు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ “చలో ఢిల్లీ” పిలుపు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.