తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం జరిగిన గ్రీవెన్స్ సెల్ జాయింట్ కలెక్టర్ మహేందర్ జి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడారు. రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ప్రతినెలా 3016 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని, హామీ ఇచ్చిందని దాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా నిరుద్యోగ యువతను ఎందుకు పట్టించుకోవడంలేదని తిరుపతి ప్రశ్నించారు. మరోసారి అధికారంలోకి రావడం కోసం, ఉద్యోగ ప్రకటనలతో మోసం చేస్తుందని, యువత నమ్మి మోసపోవద్దని తెలిపారు. గతంలోనే సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని, హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని, టెక్స్టైల్ పార్కులు ప్రారంభం చేసి వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకొని పరిశ్రమలు స్థాపిస్తామని మోసం చేసిందని, నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో యువత తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు హనుమకొండ నక్కల గుట్టలోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా స్పెషల్ బ్రాంచ్ ల పేరుతో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మహేందర్ జి కి డివైఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్, జిల్లా సహాయ కార్యదర్శిలు మంద సురేష్, ఓర్సు చిరంజీవి పాల్గొన్నారు.