పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం
అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.చిన్నారులకు వేసే రెండు పోలియో చుక్కలు వారి భవిష్యత్తు ఆరోగ్యానికి రక్షణ కవచంగా నిలుస్తాయని పేర్కొన్నారు.పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం అంటే భవిష్యత్ తరాలకు సురక్షితమైన పునాది వేయడమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు