పోక్సో చట్టం అంటే పోలీసుల ఇష్టమా అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు.కర్నూలు నందలి మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో బాధిత మహిళలతో కలిసి ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కర్నూలు పట్టణములో వున్న సున్నపువీధీలో నివాసం ఉంటున్న ముస్లీమ్ మైనర్ బాలికను ఇంటి ఎదురుగా ఉన్న మైనర్ అబ్బాయి ఆ అమ్మాయి వెంటబడుతూ ప్రేమించమని పలుమార్లు వేధిస్తున్నా తల్లీ లేని ఆ అమ్మాయి మేనత్త అయిన ఖాసీంబీ కి చెప్పుకుని బాధ పడేది. అయితే ఫిబ్రవరి నెల 3.2.2023 వ తేదీన రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో నిందితుడు అయిన మైనర్ అబ్బాయి ఆ అమ్మాయి ఇంట్లోకి జొరబడి ఆ అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేస్తే, ఆ అమ్మాయి,వాళ్ళ చెల్లెలు ఇద్దరూ కలిసి నిందితుడిని తోసి తప్పించుకుని పక్కన వున్న ఇంటి ఓనరు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మొబైల్ ఫోన్ నుండి వాళ్ళ మేనత్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. హుటాహుటిన మేనత్త, అమ్మాయి కజిన్ అన్న కలిసి అమ్మాయి ఇంటికి వెళ్ళీ, అబ్బాయి తల్లిని నిలదీశారు. మమ్మల్ని నిలదీస్తావా అంటూ అబ్బాయి తల్లీ వారి బంధువులకు సమాచారం చేరవేసి అందరూ కలిసి పెట్రోల్ బాటిళ్ళతో, కత్తులతో వచ్చి పెట్రోల్ పోసి తగుల బెడతమని చెబుతూ, నానా బూతులు తిడుతూ, అమ్మాయి అన్న బైక్ ను కత్తులతో నరుకుతు ధ్వంసం చేశారు. అమ్మాయి అన్న 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అరగంటకు పోలీసులు వచ్చి గుంపులుగా వున్న జనాలను పంపించేశారని ఆమె అన్నారు. ఉదయం వెళ్ళి అమ్మాయి,వాళ్ళ మేనత్త కలిసి ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించు కోలేదని, అమ్మాయి ఒంటి మీద వున్న అబ్బాయి తాలూకు గాయాలు చూసి ఆసుపత్రికి పంపించి చికిత్స అందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత బాధితులే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారని నాలుగు రోజులు స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదని, చివరకు 7.2.2023 వ తేదీన FIR No.4/2023 కేసు నమోదు చేశారని ఆమె తెలిపారు. బాధితులు నిందితులపై చర్యలు చేపట్టమని సి.ఐ. గారిని అడిగితే ఏంటీ రేప్ జరగలేదు కదా, మీ అమ్మాయి చచ్చిపోలేదు కదా అని ఒక స్టేషన్ హౌస్ అధికారి మాట్లాడటం బాధాకరం అని ఆమె అన్నారు. సంఘటన జరిగి నెల అవుతున్నా పోలీసులు ఇంతవరకు నిందితులపై చర్యలు చేపట్టని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ సి.ఐ నిర్లక్ష్య వైఖరిపై, నిందితులకు కొమ్ముకాస్తున్న స్థానిక శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ వైఖరిపై మహిళా ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులను రిమాండ్ కు తరలించి మైనర్ బాలికకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ ముందు మహిళా ఐక్య వేదిక నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు మాల్యా దేవీబాయి, ఖాసీంబీ లు పాల్గొన్నారు.