భూ సమస్యల పరిష్కారానికి వేగం పెంచాలి
భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలను వేగవంతంగా, శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.బుధవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. భూ వివాదాలకు సంబంధించిన అన్ని రికార్డులు, ప్రస్తుత భూస్ధితి (పొజిషన్)లను సమగ్రంగా పరిశీలించి, స్పష్టమైన నివేదికలను అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని సూచించారు.రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన భూ వివాదాల విషయంలో సంయుక్త సర్వేలు నిర్వహించడం ద్వారా స్పష్టమైన సరిహద్దులను నిర్ణయించాలని కలెక్టర్ తెలిపారు.భూసరిహద్దులపై తలెత్తుతున్న వివాదాలను పరస్పర సమన్వయంతో పరిష్కరించేందుకు శాఖలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. భూ సమస్యల పరిష్కార ప్రక్రియలో పారదర్శకతను కచ్చితంగా పాటించాలని, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే పెండింగ్లో ఉన్న భూ కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తగ్గించాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, ఆర్డీఓ హరికృష్ణతో పాటు భూపాలపల్లి,గణపూర్,కొత్తపల్లిగోరి,రేగొండ, చిట్యాల, టేకుమాట్ల,మొగుళ్లపల్లి మండలాల తహసీల్దార్లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.