మున్సిపల్ ఎన్నికల్లో పకడ్బందీ పర్యవేక్షణ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించేందుకు 27 లోకేషన్లలో 30 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి తెలిపారు.శనివారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో సూక్ష్మ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పడంలో సూక్ష్మ పరిశీలకులు కీలక పాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ప్రక్రియ మొత్తం సక్రమంగా జరుగుతోందో లేదో నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత సూక్ష్మ పరిశీలకులదేనని తెలిపారు.పోలింగ్ రోజున ఓటింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని కేటాయించిన లోకేషన్లలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ఏవైనా అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు లేదా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూక్ష్మ పరిశీలకులను కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రతి చర్య ఉండాలని ఆమె స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జోనా,సంబంధిత అధికారులు, సూక్ష్మ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.