రైతు వేదికలో అన్నదాత ఉత్సవం
వ్యవసాయంలో పాత పద్ధతులను విడనాడి, కాలానుగుణంగా వస్తున్న ఆధునిక సాంకేతికతను రైతులు స్వీకరించాలని ఎస్బీఐ వరంగల్ రూరల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ఏఎన్వీ సుబ్బారావు సూచించారు.ప్రపంచ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎస్బీఐ ఆధ్వర్యంలో రేపాక రైతు వేదికలో ‘అన్నదాత ఉత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు డ్రోన్ స్ప్రేయర్లు, హార్వెస్టర్లు, సోలార్ పరికరాలు వంటి ఆధునిక యంత్రాలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పీఎంజీఈపీ పథకం ద్వారా ఈ పరికరాలను సులభంగా పొందవచ్చని,తద్వారా ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని తెలిపారు.రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎస్బీఐ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, అవసరమైన రుణ సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.రుణాలు తీసుకున్న రైతులు నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయడం ద్వారా ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.గత పది సంవత్సరాలుగా వ్యవసాయ రుణాలు తీసుకొని సమయానికి రెన్యువల్ చేసుకుంటూ ప్రభుత్వ సబ్సిడీలు పొందుతున్న ఐదుగురు రైతులను బ్యాంకు సిబ్బంది ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎస్బీఐ ఏసీబీ చీఫ్ మేనేజర్ రవి, డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ నిఖిల్, సీఎస్పీ పాయింట్ నిర్వాహకులు మడప మమత సంపత్ రెడ్డి, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, గ్రామ సర్పంచ్ గుల్ల స్వప్న తిరుపతి, ఉప సర్పంచ్ వెంగల నర్సయ్య, రిటైర్డ్ ఎంఈఓ పగడాల ఐలయ్య, మాజీ సర్పంచ్ పొనగంటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు