సూర్యఘర్ యోజనతో విద్యుత్ ఖర్చులకు చెక్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడంతో పాటు గృహ విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన”ను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో రెడ్కో, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా యోజన ప్రచార రథాన్ని, అవగాహన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ వినియోగదారులు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ వినియోగ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.ఈ పథకం కింద 1 కిలోవాట్ నుండి 3 కిలోవాట్ వరకు సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని పేర్కొన్నారు. 1 కిలోవాట్కు సుమారు రూ.30,000, 2 కిలోవాట్స్కు రూ.60,000, 3 కిలోవాట్స్కు రూ.78,000 వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. అదనంగా రూ.18,000 వరకు ప్రోత్సాహకాలు కూడా పొందే అవకాశం ఉందన్నారు.ఈ సౌర వ్యవస్థల ద్వారా నెలకు సుమారు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకునే అవకాశం ఉండటంతో గృహ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని కలెక్టర్ వివరించారు.అర్హులైన వినియోగదారులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అలాగే స్థానిక డిస్కం కార్యాలయాలు లేదా టీజీఆర్ఈడీసో హెల్ప్డెస్క్ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.పర్యావరణ పరిరక్షణతో పాటు శుద్ధ శక్తి వినియోగాన్ని పెంపొందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, రెడ్కో డీఎం మహేందర్ రెడ్డి, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు