
హన్మకొండ జిల్లా, ఫిబ్రవరి 25: సిద్ధాపూర్ గ్రామంలో సంచలనం సృష్టించిన హత్య కేసును హసన్పర్తి పోలీసులు వేగంగా ఛేదించారు. కేసులో నిందితురాలైన వంగ ఇందిర (48)ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఫిబ్రవరి 24న బాల్నే మొగిలి తన ఇంటి వెనుక మృతదేహంగా కనిపించగా, ఆయన కుమారుడు బాల్నే రాజకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన హసన్పర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వట్టే చేరాలు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.నమ్మదగిన సమాచారం ఆధారంగా వంగపాడు గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, సుమారు 30 సంవత్సరాల క్రితం జరిగిన విడాకుల సమయంలో వచ్చిన డబ్బుల విషయంలో బావ బాల్నే మొగిలితో వంగ ఇందిరకు విభేదాలు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 24వ తేదీ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఇంటి వెనుకకు వెళ్లిన మొగిలిపై రాయి, కత్తి, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.