భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బి.శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేత
ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన పూర్వపు ఆర్టీఓ వెంకన్న స్థానంలో నియామకం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన రవాణా శాఖ అధికారి (డి టి ఓ/ఆర్ టి ఓ)గా బి. శ్రీనివాస్ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన జిల్లా నూతన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్ఛానికి బదులుగా ఒక మొక్కను అందించి, జిల్లాలో రవాణా శాఖ పరంగా తూచా తప్పకుండా బాధ్యతలు నిర్వహిస్తామని నివేదించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్కు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ,జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుదలకు, నిబంధనల అమలుకు కృషి చేయాలని సూచించారు.
పూర్వపు ఆర్టీఓ వెంకన్న ఆకస్మిక మృతితో ఖాళీ
భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆర్టీఓ వెంకన్న ఈ నెల (జూన్) 22వ తేదీన జరిగిన ఒక ఘోర లారీ ప్రమాదంలో దురదృష్టవశాత్తూ అక్కడికక్కడే మృతి చెందిన సంగతి విదితమే.ఆయన ఆకస్మిక మరణంతో జిల్లా రవాణా శాఖ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనవడమే కాకుండా, ఆర్టీఓ పోస్టు ఖాళీగా మారింది. అత్యంత కీలకమైన రవాణా శాఖలో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు,ప్రభుత్వం తక్షణమే స్పందించి బి. శ్రీనివాస్ను భూపాలపల్లి జిల్లా నూతన రవాణా అధికారిగా నియమిస్తూ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు.
శాఖ పురోగతికి కృషి చేస్తా:డిటిఓ శ్రీనివాస్
ఈ సందర్భంగా నూతన రవాణా అధికారి బి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రమాద వశాత్తూ మరణించిన పూర్వపు అధికారి వెంకన్న ఆశయాలకు అనుగుణంగా,జిల్లాలో రవాణా శాఖను సమర్థవంతంగా నడిపిస్తానని అన్నారు.వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామని,జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయ పరిపాలనా సిబ్బంది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎం వీ ఐ),కార్యాలయ సిబ్బంది పాల్గొని నూతన అధికారికి శుభాకాంక్షలు తెలిపారు.