ఉచిత పశు వైద్య శిబిరం
జనగామ జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామంలో శుక్రవారం జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రడపాక హరిబాబు, ఉపసర్పంచ్ కొత్త వీరస్వామి ప్రారంభించారు.ఉప్పుగల్ పశువైద్యాధికారి డా. కాకుమాను శ్రీనాథ్ ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయించినట్లయితే ఆడ దూడలు మాత్రమే పుట్టే అవకాశముందని తెలిపారు. రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తిమ్మంపేట ఏ.డి. డా. డి. సారంగపాణి మాట్లాడుతూ, దూడ పుట్టిన వెంటనే జున్ను పాలు త్రాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.ఈ శిబిరానికి వచ్చిన పాడి పశువులకు డా. కాకుమాను శ్రీనాథ్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మొత్తం 68 పశువులు శిబిరానికి రాగా, 28 దూడలకు నట్టల నివారణ మందులు, 4 గేదెలకు కృత్రిమ గర్భధారణ, 16 గర్భకోశ వ్యాధులకు చికిత్సలు అందించారు.శిబిరంలో గోపాలమిత్ర సూపర్వైజర్ వెంపటి రాజేశ్వర్ రావు, గోపాలమిత్రులు గుజ్జరి రాజు, చిలువేరి నగేష్, సాంబరాజు, దివ్య, కత్తుల లచ్చయ్యతో పాటు గ్రామ పాడి రైతులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు