కార్మిక వ్యతిరేక బడ్జెట్కు వ్యతిరేకంగా సిఐటియు నిరసన
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉందని సిఐటియు తీవ్రంగా విమర్శించింది. మొతినగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3 లక్షల 25 వేల కోట్ల భారీ బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేటాయించిన నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయకుండా, కార్మికుల కోసం కొత్తగా నిధులు కేటాయించకపోవడం తీవ్రమైన అన్యాయం అని పేర్కొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల కోసం అత్యవసరమైన సదుపాయాలు అయిన పని ప్రదేశాల్లో షెడ్లు ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, బాత్రూమ్ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి అంశాలకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
అలాగే కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇది కార్మికుల హక్కులకు విరుద్ధమని తెలిపారు.
కాబట్టి భవన నిర్మాణ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది.
ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్, మొతినగర్ యూనియన్ అధ్యక్షుడు బాలు, కార్యదర్శి శంకర్, కో నరేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, నాగేష్, ఎల్లయ్య, శ్రీనివాస్, మహమూద్, నరసింహ, రమేష్, ఎల్లేష్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.