చేనేత సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం
రేగొండ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా (చైర్మన్గా) పన్నాటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రూపిరెడ్డిపల్లి గ్రామంలోని చేనేత సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆయన పేరును ప్రతిపాదించి ఆమోదించారు.దీంతో అధ్యక్ష పదవికి పన్నాటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రిలీఫ్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా (వైస్ చైర్మన్గా) రాచర్ల రాజేందర్, కార్యదర్శిగా కూచన రాజ్ కుమార్, కోశాధికారిగా కొండా స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా పన్నాటి మార్కండేయ, మంతెన రవీందర్, ఆడెపు బాబు, పన్నాటి రమ, కూచన అరుణలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పన్నాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న చేనేత సంఘం సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. చేనేత రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి త్వరితగతిన పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి అందేలా చూస్తానని, కార్మికుల ఆర్థికాభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. చేనేత సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికుల హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని సంఘం సభ్యులు, చేనేత కార్మికులు, గ్రామ పెద్దలు శాలువాలతో ఘనంగా సన్మానించి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.