బడ్జెట్ డోల్ల… ఆరు గ్యారెంటీలపై చిత్తశుద్ధి చూపాలి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,పట్టణ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రజల ఆశలను నెరవేర్చలేదని, ఇది “డోల్ల బడ్జెట్”గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు.ఎన్నికల సమయంలో “ఆరు గ్యారెంటీలు” పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.ప్రజలు బడ్జెట్పై ఎంతో ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆ ఆశలు నిరాశలయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల కేటాయింపులు గత ఏడాదితో పోలిస్తే తగ్గడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతుబంధు వంటి కీలక పథకాల అమలులో స్పష్టత లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో కూడా ప్రభుత్వం వెనుకడుగు వేసిందని విమర్శిస్తూ, మహాలక్ష్మీ పథకం కింద ₹2500, తులం బంగారం, ఆడపిల్లలకు స్కూటీలు వంటి హామీలు బడ్జెట్లో ఎక్కడా కనిపించకపోవడం నిరాశ కలిగించిందన్నారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాలనలో రైతులకు ముందస్తుగా రైతుబంధు అందించేవారని,ప్రస్తుతం ఆ పద్ధతి కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 శాతం కాలం పూర్తయినా, హామీల అమలులో పురోగతి లేకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోందని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్లో మార్పులు చేసి, ఆరు గ్యారెంటీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని గండ్ర వెంకట రమణా రెడ్డి డిమాండ్ చేశారు.ప్రజా ప్రతినిధులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.