
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లక్హమ్మగూడెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భార్యపై కోపంతో ఓ తండ్రి తన రెండేళ్ల కూతురిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది.రవి, స్వాతి దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు మేఘన (2), మయూరి (9 నెలలు)తో కలిసి నివసిస్తున్నారు. అయితే, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో మూడు నెలల క్రితం స్వాతి చిన్న కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. పెద్ద కూతురు మేఘన తండ్రి వద్దే ఉండేది.ఈ నేపథ్యంలో పెద్ద కూతురిని కూడా తన వద్దకు పంపించాలని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ పరిణామాలతో పరువు పోయిందనే కోపం, కూతురు దూరమవుతుందనే ఆవేదనలో రవి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.తన పెద్ద కూతురు మేఘనకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి తినిపించి హత్య చేశాడు. అనంతరం తాను కూడా అదే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై భార్య స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదన కలిగించింది.