మంచినీటి సమస్యపై ఆందోళన
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్లలో నెలకొన్న మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆదివారం ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వ హయాంలోనే మంచినీటి సరఫరా కోసం చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం పనులు సకాలంలో పూర్తికాకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.మంచినీటి సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నప్పటికీ, అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలోనే ఈ సమస్య కొనసాగుతుండటం ప్రస్తుత ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నార్థకంగా మారుస్తోందని ఎద్దేవా చేశారు.ఈ విషయమై మున్సిపల్ కమిషనర్తో ఫోన్ ద్వారా మాట్లాడిన గండ్ర,సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించకపోతే తన సొంత ఖర్చులతోనే ప్రజలకు నీటి సౌకర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన హామీ ఇచ్చారు.స్థానిక ప్రజలు కూడా సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతూ తమ ఇబ్బందులను వెల్లడించారు.