మీడియా ప్రతినిధులను పరామర్శించిన జిల్లా కలెక్టర్
జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో గురువారం లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదంలో గాయపడిన మీడియా ప్రతినిధులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరామర్శించారు.ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్, గాయపడిన మీడియా ప్రతినిధులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన అన్ని విధాల మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులు,సిబ్బందికి ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పెద్ద భవనాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ మరియు పంచాయతీ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి భవనాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్, పెద్ద భవనాలకు నిబంధనల మేరకు పార్కింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్ఎంఓ దివ్య తదితరులు పాల్గొన్నారు.