వర్షాకాల వ్యాధుల నివారణకు సమష్టి చర్యలు తీసుకోవాలి
వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి సూచించారు.వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేఘన అధ్యక్షతన ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా,వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.దోమల నివారణ కోసం గ్రామపంచాయతీ తరఫున ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని,నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అలాగే గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు మండల కేంద్రంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయని, స్థల సేకరణ పూర్తైందని, త్వరలోనే శంకుస్థాపన నిర్వహిస్తామని వెల్లడించారు.సమావేశంలో ఉపసర్పంచ్ శ్రీకర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్, డాక్టర్ వైశాలి, ఆరోగ్య విస్తరణాధికారులు వెంకటేశ్వర్లు, కుమారస్వామి, ప్రభావతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.