వేసవిలో సాగునీటి కొరత లేకుండా చర్యలు
వేసవి కాలంలో రైతులకు సాగునీటి కొరత ఏర్పడకుండా చెరువులు, కుంటలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ప్రాజెక్టు కాలువల ద్వారా నీరు సమృద్ధిగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.గురువారం ఐడిఓసి కార్యాలయంలో వేసవి కాలంలో పంటలకు సాగునీటి లభ్యతపై రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ మరియు మార్కెటింగ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు జిల్లాలోని చెరువులు, కుంటలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మరియు ప్రాజెక్టు కాలువల ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి పరిస్థితులను కలెక్టర్కు వివరించారు. రైతులకు సాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.సాగునీటి వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ నీటి వృథా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన, రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం మరియు మార్గదర్శకాలు అందించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అలాగే సాగునీటి అక్రమ వినియోగం జరగకుండా పటిష్ట పర్యవేక్షణ నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఏఎస్పీ నరేష్ కుమార్, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ,మార్కెటింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.