ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభం
వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి:కలెక్టర్ రాహుల్ శర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ప్రజలు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు,వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.సోమవారం భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు “ఈట్ రైట్ వాక్” కార్యక్రమాన్ని నిర్వహించి వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఏప్రిల్ 6 నుండి 11వ తేదీ వరకు జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయడం,ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం,వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.ప్రతి రోజుకు ప్రత్యేక థీమ్ను నిర్ణయించి,ఆ థీమ్కు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.వారోత్సవాల షెడ్యూల్ ప్రకారం,ఏప్రిల్ 6న ఆహార భద్రత దినంగా జరుపుతూ ఆహార భద్రత నిబంధనలపై అవగాహన కల్పిస్తారు.7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా సమగ్ర ఆరోగ్య సేవలపై దృష్టి సారిస్తారు.8న ఎయిడ్స్ అవగాహన దినంగా హెచ్ఐవి నిరోధంపై కార్యక్రమాలు చేపడతారు.9న సురక్షిత మాతృ దినంగా తల్లి-శిశు ఆరోగ్యంపై చర్యలు తీసుకుంటారు.10న ఆయుష్ దినంగా యోగా,హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తారు.11న మాదకద్రవ్యాల నియంత్రణ దినంగా వ్యసనాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తారు.ఈ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు,కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,ఉప కేంద్రాలలో ఆరోగ్య శిబిరాలు,స్క్రీనింగ్ పరీక్షలు,పోషకాహార సలహాలు,గృహ సందర్శనలు,ప్రసూతి శిబిరాలు,యోగా శిబిరాలు,ఆయుష్ వైద్య సేవలు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని కలెక్టర్ వివరించారు.ఆహార భద్రత అధికారులు,ఎన్సీడీ ప్రోగ్రామ్ సిబ్బంది,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,ఆయుష్ విభాగం ఇన్చార్జ్లు,డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఈ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మధుసూదన్,ఆహార తనిఖీ అధికారి వరుణ్ రెడ్డి,ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.