గంగారం మోడల్ స్కూల్లో షీ టీమ్ అవగాహన సదస్సు
విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని భూపాలపల్లి షీ టీమ్ ఎస్సై ఫజల్ ఖాన్ పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు గురువారం కాటారం మండలం గంగారం మోడల్ స్కూల్,కళాశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ… గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్ హరాస్మెంట్, మహిళల భద్రతా చట్టాలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు సమగ్రంగా వివరించారు.అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్,వీడియో కాల్స్కు స్పందించవద్దని, సోషల్ మీడియా పరిచయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా వెంటనే ఉపాధ్యాయులకు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు.మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా వేధింపులకు గురిచేస్తే ధైర్యంగా షీ టీమ్ మొబైల్ నంబర్ 8712658162 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 సేవలను వినియోగించుకోవాలని, ఒకవేళ సైబర్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్లైన్ 1930 కు ఫిర్యాదు చేయాలని వివరించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్సై ఫజల్ ఖాన్తో పాటు షీ టీమ్ సిబ్బంది,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థినులు పాల్గొన్నారు.