దౌలత్నగర్లో భూ కబ్జా ఆరోపణలు
3 ఎకరాల భూమి అక్రమంగా విక్రయించారన్న రైతు
*ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు, ప్రజావాణిలో ఫిర్యాదు
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం దౌలత్నగర్ గ్రామానికి చెందిన రైతు చీమల అయిలయ్య తనకు వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై పట్టా చేసి విక్రయించారని ఆరోపించారు.
ఈ మేరకు ఆయన వరంగల్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో,పర్వతగిరి పోలీస్ కేంద్రంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైతు అయిలయ్య ఇచ్చిన వివరాల ప్రకారం, దౌలత్నగర్ గ్రామ పరిధిలోని సర్వే సంఖ్య 419లో ఉన్న 3 ఎకరాల భూమిని గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నానని పేర్కొన్నారు.అయితే అదే గ్రామానికి చెందిన చీమల బిక్షపతి తన కుటుంబ సభ్యుల పేర్లు ఉపయోగించి రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా భూమిని ఇతరుల పేరుపై పట్టా చేయించి విక్రయించారని ఆరోపించారు. ఈ విషయం ప్రశ్నించగా తనను తిట్టడంతో పాటు భూమి గురించి మళ్లీ అడిగితే బెదిరిస్తున్నారని అయిలయ్య వాపోయారు.దీంతో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.భూ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని, అక్రమంగా జరిగిన పట్టా మార్పు, విక్రయాలపై చర్యలు తీసుకోవాలని అయిలయ్య అధికారులను కోరారు.కాగా,ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వివరణ తెలియాల్సి ఉంది. అధికారులు విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.