ముస్లిం మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని విద్య, ఉపాధిలో అభివృద్ధి సాధించడం ద్వారా సాధికారతను సాధించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రఫత్ అధ్యక్షతన ‘ముస్లిం మహిళలు- సాధికారత’ అనే అంశంపై సెమినార్ జరిగింది. సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మహమ్మద్ అబ్బాస్ ప్రసంగించారు. ముస్లిం మహిళలలో సామాజిక చైతన్యం పెరుగుతోందని అన్యాయం అణిచివేతలపై ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. సిఎఎ, ఎన్.ఆర్.సి వ్యతిరేక ఉద్యమానికి ముందుండి నాయకత్వం వహించి వీరోచితంగా నడిపింది ముస్లిం మహిళలే అన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, పోలీసు కేసులు పెట్టినా, పోలీసులచే, మతోన్మాద గూండాలచే దాడులు చేయించినా వెరవకుండా పోరాటం చేశారన్నారు. చారిత్రాత్మక రైతాంగ ఉద్యమానికి ప్రేరణ ముస్లిం మహిళలు చేసిన పోరాటమేనన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముస్లిం మహిళలు రాణిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంనుండే ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమానికి అండగా నిలిచారు. డాక్టర్లుగా, లాయర్లుగా, న్యాయమూర్తులుగా, అధ్యాపకులుగా, ఐఎఎస్, ఐపిఎస్ లాంటి అనేక బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఇంకా ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని కుటుంబాలు వారి ఎదుగుదలకు తోడ్పడాలని అన్నారు. మతోన్మాద శక్తులు తమ రాజకీయ ప్రయోజనాలకోసం ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారి, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ముస్లిం మహిళలు విద్యా, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని అన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో దేశంలో జరుగుతున్న మార్పులు ప్రభావం మహిళల పైన ఎక్కువగా ఉంటుందని, మార్పులను జాగ్రత్తగా గమనించాలని అన్నారు. ఆవాజ్ కమిటీ ముస్లిం మహిళల అభివృద్ధికి కృషి చేస్తోందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, హమీద్, యూసఫ్, కెవిపిఎస్ నాయకులు ఎం.దశరథ్ ప్రసంగించారు.ఆవాజ్ ముషీరాబాద్ నాయకులు తన్వీర్ ఆలియా, సాజిదా రహమాన్, షేక్ రిజ్వానా, ఫరీన్ భాను, ఫిర్దోష్ బాన్,అర్షియా నాజ్, పరిహీన్ మెహదీ, అప్సరీ తబస్సుమ్, ఫౌజియా నౌషిన్, నాజియా తబస్సుమ్ తదితరులు పాల్గొన్నారు.