జఫర్గఢ్ మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన మంగు జయప్రకాశ్
జనగామ జిల్లా జఫర్గఢ్ మండల నూతన మండల విద్యాధికారి (ఎంఈఓ)గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హిమ్మత్నగర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి సందీప్ కుమార్ ఝా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.మంగు జయప్రకాశ్ 1996 డిసెంబర్లో స్టేషన్ ఘన్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పగూడెంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా విద్యాశాఖలో సేవలను ప్రారంభించారు. అనంతరం 2001లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది జఫర్గఢ్ మండలంలోని కోనాయచలం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. 2005లో బదిలీపై మళ్లీ ఇప్పగూడెం పాఠశాలకు వెళ్లి, 2015లో తిమ్మంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి 2024లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొంది హిమ్మత్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.గత ఏడాదిన్నరగా రఘునాథపల్లి మండల విద్యాధికారి రఘునందన్ రెడ్డి జఫర్గఢ్ ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహించగా, ప్రస్తుతం ఆయనను రఘునాథపల్లి ఎంఈఓగా కొనసాగిస్తూ జఫర్గఢ్ మండలానికి ఫుల్ అడిషనల్ ఛార్జ్తో మంగు జయప్రకాశ్ను నియమించారు.శుక్రవారం స్థానిక మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ)లోని ఎంఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగు జయప్రకాశ్ మాట్లాడుతూ, మండలంలోని విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల పురోగతి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తన శక్తిమేరకు కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ శివ, కంప్యూటర్ ఆపరేటర్ రాజ్కుమార్, సీఆర్పీలు స్వామి, రమాదేవి, బాబు, సునీత, సీనియర్ ఉపాధ్యాయులు పిట్టల మహేందర్, ఉపాధ్యాయులు వేణుగోపాల్, శ్రవణ్ కుమార్, బాల ప్రతాప్ రెడ్డి తదితరులు మంగు జయప్రకాశ్ను పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.