హసన్పర్తిలో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్
హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.80 వేల విలువైన పల్సర్ 150 సీసీ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత నెల 28న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన పొనగంటి రాజు తన పల్సర్ (టిఎస్-17-L-6635) బైక్పై ప్రయాణిస్తుండగా వంగపహాడ్ క్రాస్ రోడ్ సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద పెట్రోల్ అయిపోయింది. దీంతో సమీపంలోని క్రిష్ బార్ వద్ద బైక్ను నిలిపి అలసటతో నిద్రపోయాడు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అతని జేబులోని బైక్ తాళాలు దొంగిలించి, వాహనంతో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హసన్పర్తి ఇన్స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో ఎస్ఐ పి. గోవర్ధన్, సిబ్బంది బి. బావ్ సింగ్, ఎం. భరత్ కుమార్లు విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక గాలింపు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు.అరెస్టయిన నిందితుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భీజాపూర్ జిల్లాకు చెందిన తెల్లం మహేష్ (25)గా పోలీసులు గుర్తించారు.జీవనోపాధి కోసం హనుమకొండకు వచ్చిన అతడు, స్వగ్రామానికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.దొంగిలించిన బైక్పై స్వగ్రామానికి పారిపోతుండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.ఈ కేసు ఛేదనలో స్టేషన్ రైటర్లు సుమన్, మహేందర్, పూర్ణచారి, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు