, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా *బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్* దిందా వాగు ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకొని వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆధిపత్య పాలకులు పట్టించుకోవడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.కొమురం భీమ్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న దిందా వాగును శనివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. దిందా వాగు ఉదృతికి ఏరుదాటే దారి లేక జలదిగ్బంధంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయి విద్య,వైద్యం లేక అనేక అవస్థలుపడుతున్నారని అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వర్షాకాలం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. 2017 లోనే దిందా వాగుపై రూ.2 కోట్లతో వంతెనల నిర్మాణం మంజూరై,స్థానిక ఎమ్మెలే భూమి పూజ చేసినా ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వంతెన నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో స్థానికులకు శాపంగా మారిందని అన్నారు.గతంలో వాగు ఉదృతికి ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ నిధుల కింద నిధులు మంజూరు చేసి వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేశారు.కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే ప్రజలకు అవసరం లేని సెక్రటేరియట్,రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణాలకు వేలకోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారని విమర్శించారు. తదనంతరం కేతిని గ్రామంలో పర్యటించారు.పర్యటనలో నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,జిల్లా ఇంచార్జ్ సోయం చిన్నయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, జిల్లా కోశాధికారి నవీన్, మండల అధ్యక్షులు లాన్సు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.