టికెట్ల పేరుతో అన్నారం దర్గాలో అడ్డగోలు వసూళ్లు
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలోని ప్రముఖ యాత్ర స్థలం అన్నారం షరీఫ్ హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావాలి బాబా దర్గాలో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
దర్గాలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు,వాచ్మెన్లు మొత్తం 27 మంది సిబ్బంది ఉండగా,అందులో 10 మంది మాత్రమే విధులకు సక్రమంగా హాజరవుతున్నారని, మిగతావారు డ్యూటీకి రాకున్నా ప్రతినెలా జీతాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాజరు పర్యవేక్షణలో దర్గా సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇది జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
భక్తులపై దౌర్జన్యం:
యూనిఫామ్, ఐడీ కార్డులు లేకుండా కొందరు సిబ్బంది హుండీల చుట్టూ గుమిగూడి భక్తులను భయపెడుతున్నారని ఆరోపణ. నైవేద్యం తెచ్చిన భక్తుల నుండి “రూ.1000 ఇస్తేనే దర్శనం” అని దౌర్జన్యం చేస్తున్నారని, కానుకలను హుండీలో వేయకుండా జేబులో వేసుకుంటున్నారని భక్తులు వాపోతున్నారు. ప్రశ్నించిన గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తున్నారని సమాచారం.
అధిక రేట్ల వసూలు:
ఆర్డర్ కాపీ లేకుండానే యాట కందూరు టికెట్ రూ.300, కోడి కందూరు రూ.100, వెంట్రుకల టికెట్ రూ.50, టూవీలర్ పూజ రూ.150, త్రీవీలర్ రూ.200, ఫోర్ వీలర్ రూ.300, కొబ్బరికాయ టికెట్ రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపణ. కొబ్బరికాయ టికెట్ ఉన్నా ఒక్కో కాయకు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని, ప్రతి శుక్రవారం 10-15 బస్తాల కొబ్బరి వక్కలను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు.
సౌకర్యాలు శూన్యం:దర్గాకు ఏటా రూ.3 కోట్ల ఆదాయం వస్తున్నా భక్తులకు తాగునీరు,టెంట్లు, కూర్చునేందుకు సిమెంట్ బెంచీల సౌకర్యం లేదు. గతంలో ట్రాఫిక్ నియంత్రణ చేసే సిబ్బంది ఇప్పుడు లేకపోవడంతో శుక్రవారం రోజున వాహనాల రద్దీతో గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు.ఈ అక్రమ వసూళ్లను అరికట్టి, సిబ్బంది అందరూ యూనిఫామ్,ఐడీ కార్డులతో విధులకు హాజరయ్యేలా చూడాలని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారం గ్రామస్తులు, భక్తులు దర్గా సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్,ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరుతున్నారు.