డబ్బు సంచులతో వస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి ప్రజా ధనంతో వస్తున్న నన్ను గెలిపించాలని సిపిఎం మధిర నియోజకవర్గం అభ్యర్థి పాలడుగు భాస్కర్ ఓటర్లను అభ్యర్థించారు. మండల పరిధిలోని బోనకల్, చిరునోముల, చొప్పకట్లపాలెం, ముష్టికుంట్ల, ఆళ్ళపాడు, రాయన్నపేట, మోటమర్రి, గోవిందాపురం ఏ గ్రామాలలో పాలడుగు భాస్కర్ గురువారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సిపిఎం శ్రేణులు ప్రజలు ఆయనకు మోటార్ సైకిల్ తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. మధిర – బోనకల్ రోడ్డు వెంటనే మనమత్తులు చేయిస్తానని, మధిర నియోజకవర్గంలో ఉన్న ఆయకట్టు చివర భూములకు నాగార్జునసాగర్ నీటిని అందేల కృషి చేస్తానని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న జాలిముడి ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకొస్తానన్నారు. బోనకల్లో తోళ్ల పరిశ్రమ, చింతకానిలో రైలు స్లేపర్ కోచ్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ముదిగొండ ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమల పరిరక్షణకై ఉద్యమిస్తానన్నారు. రేమిడిచర్లలో పరిశ్రమల కోసం కేటాయించిన 60 ఎకరాల భూమిలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానన్నారు. సొంత ఇంటి జాగా ఉన్న వారితోపాటు నిరుపేదలకు 125 చదరపు గజాల స్థలమిచ్చి, 15 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధిర మునిసిపాలిటీలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లోనే ఖాళీలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించకుండా ఖచ్చితంగా ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక ఉద్యమ నేతగా గ్రామపంచాయతీ, మున్సిపల్, వీఆర్ఏ, భవన నిర్మాణం, హా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ఆశ, అంగనవాడి, మధ్యాహ్న భోజనం, మిషన్ భగీరథ, హమాలి, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించి విజయం సాధించానన్నారు. మధిర అభివృద్ధి గురించి పట్టించుకోని బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించటం తోనే మధిర నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డబ్బులతో ఓట్లు కొనేవారు అభివృద్ధి గురించి పట్టించుకోరని కేవలం వారు సంపాదించుకోవడానికి ఆ పదవిని ఉపయోగించుకుంటారని విమర్శించారు. పదవిని ప్రజల అభివృద్ధి కోసం వినియోగించే సిపిఎం అభ్యర్థికి ఓటు వేస్తారా? పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించుకునే వారికి ఓటు వేస్తారా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఐదేళ్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న లింగాల కమల్ రాజు మధిర నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలనైన డిమాండ్ చేశారు. పదవుల్లో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని వీరు మరల అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజల వాటిని తిప్పి కొట్టాలని కోరారు. నిత్యం ప్రజల కోసమే, ప్రజా సమస్యల మధ్య ఉంటూ పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం అభ్యర్థి అయిన తనను గెలిపించాలని పాలడుగు భాస్కర్ కోరారు. అమరజీవి బోడెపుడి వెంకటేశ్వరరావు స్ఫూర్తితో మధిర నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. మధిర నియోజకవర్గాన్ని బోడేపూడి వెంకటేశ్వరరావు కట్టా వెంకట నరసయ్య మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. తాను డబ్బులు సంచులతో ప్రచారం చేయటం లేదని, ఓటర్లకు డబ్బులు పంచలేనని, ఓటర్లే తన బలం అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రజలకు రోజువారి కూలి ఇచ్చి జనాన్ని తెచ్చుకోలేనని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరో ఆలోచించి ఓటర్లు ఓటు వేయాలని కోరారు. బూర్జువా పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయడం ద్వారా వారి అభివృద్ధి కోసమే పని చేసుకుంటారని, కానీ సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల కోసమే పని చేస్తారన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడారు ఈ ప్రచార సభలలో ఆయా గ్రామాల సిపిఎం నాయకులు, సిపిఎం శాఖ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల బాధ్యులు, అభిమానులు సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.
చొప్పకట్లపాలెంలో చేరికలు:
మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు షేక్ షాజహాన్ టిఆర్ఎస్ కాంగ్రెస్ ల నుంచి సిపిఎంలో చేరారు వీరికి పాలడుగు భాస్కర్ సిపిఎం కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.