వచ్చే ఎన్నికల్లో ఆధిపత్య పాలకుల ప్రలోభాలకు తమ ఓటును అమ్ముకోవద్దని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ నాయకులు రాజకీయాన్ని పెట్టుబడి వ్యాపారంగా మార్చి,రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.నడిగడ్డ ప్రజలు ఆధిపత్య పార్టీలు ఇచ్చే డబ్బు, మద్యానికి ఓటును అమ్ముకోకుండా ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకోవాలన్నారు.
ఆర్డీఎస్ కెనాల్ పూర్తి చేయడంలో అధికార పార్టీ నేతలు పూర్తిగా వైఫల్యం చెందారన్న ఆయన ఎన్నో ఏళ్లుగా ఆర్డీఎస్ కు రావాల్సిన నిధులు ఎవరి జేబులు నిండాయి? ఎవరి బంగ్లాలో ఉన్నాయని ప్రశ్నించారు.తుంగభద్ర వరదల్లో మునిగిన గ్రామాల నిర్వాసితులకు ఇప్పటి వరకూ ఇండ్లు కట్టించలేదని అన్నారు.నియోజకవర్గంలో చాలా గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించడంలో గత పాలకులు వైఫల్యం చెందారని అన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదన్నారు. కర్ణాటకలో ఎస్టీ కేటగిరిలో ఉన్న బోయలను తెలంగాణలో ఎస్టీ జాబితాలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్,బిఆర్ఎస్,బీజేపి పార్టీల్లో పనిచేసే దళిత నాయకులు బానిసత్వం రాజకీయాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చినా వాళ్లు ఆధిపత్య వర్గాల చేతిలో కీలు బొమ్మలుగా మారుతారాని తెలిపారు.
లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ధరించిన వాచ్ ఖరీదు రూ. 20 లక్షలని ఆరోపించారు.
బాబాసాహెబ్, కాన్షీరామ్ వారసత్వ రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బీఎస్పీనేనన్న ఆయన రాష్ట్రంలో బీఎస్పీ ఎదుగుదలను చూసి అధికార పార్టీ గుండెల్లో భయం, వెన్నుల్లో వణుకు పుడుతుందన్నారు.దొంగ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు భయపడుద్దన్న ఆయన ప్రజలను దోచుకుతింటున్న రాజకీయ నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధిచెప్పాలన్నారు. శాంతినగర్ లో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.