ఢిల్లీ రైతాంగ ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. రైతులకు అనుకూలంగా ప్రధాని ఫసల్ బీమా పథకాన్ని సవరించాలని కోరారు. రైతుల డిమాండ్ల సాధన కోసం మరో ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈనెల 11న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాష్ట్ర సదస్సు’ నిర్వహించనున్నట్టు తెలిపారు. శనివారం యాదగిరి గుట్టలోని అండల్ సదనంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలనీ, విద్యుత్ సవరణ బిల్లు-2020ను రద్దు చేయాలనీ, రైతుల రుణాలను మాఫీ చేసి, రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమ సమయంలో రైతులపై నమోదు చేసిన కేసును తక్షణమే ఎత్తి వేయాలన్నారు. రైతు సంఘంను మరింత బలోపేతం చేసి, రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ రైతాంగానికి లిఖితపూర్వకంగా రాసిచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి, రైతాంగ సమస్యలను పరిష్కరించేలా పోరాటం చేస్తామన్నారు. అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలివ్వాలన్నారు. కౌలు రైతులను గుర్తించి, వారికి బ్యాంక్ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రుణభారంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారనీ, అందుకే రుణ విమోచన చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ లక్ష రూపాయల లోపు రుణాలు రద్దు చేయడం సంతోషం తెలిపారు. అసలు తో పాటు వడ్డిలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాల వలన రాష్ట్రంలో 16లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని, ఆహార పంటలకు ఎకరాకు రూ. 10 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్లోని లోపాలను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగ డిమాండ్ల సాధనకు ఐక్యంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతు ఉద్యమ సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరు బాలరాజ్ గౌడ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మంగ నరసింహులు బూరుగు కృష్ణారెడ్డి చీరిక అలివేలు దూడ యాదిరెడ్డి కోట రామచంద్రారెడ్డి దోడ యాదిరెడ్డి కందాడి సత్తిరెడ్డి ఆనంద్ రాకల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు