రైతుల బోనస్ చెల్లింపులపై ఆగ్రహం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు రైతులు వర్షాకాలం వరి పంటకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటివరకు తమ ఖాతాల్లో జమ కాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు మాట్లాడుతూ,సమస్య పరిష్కారం కోసం పలుమార్లు వ్యవసాయ శాఖ అధికారులను,బ్యాంకులను సంప్రదించినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదని తెలిపారు.కలెక్టర్కు కూడా పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రైతుల సమస్యను ముందుకు తీసుకెళ్లిన రవి పటేల్,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సన్నవల పంటలకు క్వింటాల్కు ₹500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి,ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించడం అన్యాయం అని ఆయన అన్నారు.జిల్లా కలెక్టర్,సంబంధిత వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి రైతుల బోనస్ సమస్యను పరిష్కరించాలని రవి పటేల్ డిమాండ్ చేశారు.లేనిపక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.ప్రకృతి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంటలు పండిస్తున్న రైతులకు అధికారులు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని, ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.అయితే గడువు లోపు సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రవి పటేల్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు,రైతులు పాల్గొన్నారు.