ప్రాణహిత,పెన్ గంగా నదుల మీద దశాబ్దాలుగా నిర్మిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేస్తారో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా దహెగాం మండలంలో కర్జీ,చిన్న రాస్పల్లి, రాంపూర్,మొట్లగూడ,రావులపల్లి, గిరివల్లి పర్యటించారు.సిర్పూర్ నియోజకవర్గ ఆయకట్టుకు గుండెకాయ లాంటి తుమ్మిడిహట్టి, సాండ్ గాం,రణవిల్లి,కోర్సిని, గూడెం,హుడికిలి,లోనవెల్లి, సూర్జాపూర్,జంబుగ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు గేట్లు పెట్టినప్పటికీ నీటి నిల్వ చేయడం లేదన్నారు.పీపీ రావు ప్రాజెక్టు పనులు మధ్యలో ఆగిపోగా అసంపూర్తిగా ఉందని విమర్శించారు. 2006లో మొదలుపెట్టిన కుమ్రం భీం ప్రాజెక్టు సగం ఆయకట్టుకు కూడా సాగునీరు ఇవ్వడం లేదని విమర్శించారు.సిర్పూర్ రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
ఎన్నికల ముందే కేసిఆర్ కు సంక్షేమ పథకాలు గుర్తుకువస్తాయని విమర్శించారు.దళిత బంధు,బీసీ బంధు,మైనార్టీ బంధు,గృహలక్ష్మి పథకాల ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.రాబోయే ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేసి,ఓట్లను కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు మద్యం టెండర్లకు సిద్ధమాయ్యారని ఆరోపించారు. మద్యం టెండర్లు ఖరారు వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు.36 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లు దహెగాం మండలానికి రావడం లేదన్న ఆయన కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే మిషన్ భగీరథ ప్రవేశపెట్టారని ఆరోపించారు.చాలా గ్రామాల్లో త్రాగు నీరు రాక ప్రజలు చేతి పంపులపైనే ఆధారపడి తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని తెలిపారు.
జనాభాలో 99 శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం దక్కాలన్నదే తమ పార్టీ అంతిమ లక్ష్యమన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీ పాలన కొనసాగిస్తూ 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుని దేశంలో ఎక్కడ లేని విధంగా అసైన్డ్ భూములను కేసీఆర్ బహిరంగ వేలం వేస్తున్నారని విమర్శించారు. పేదలకు నాణ్యమైన విద్య,వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు.పేద ప్రజల అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.యాత్ర మార్గమధ్యంలో ఒడ్డుగూడలో పొలాన్ని చూడగానే, పొలంలో దిగి వరి నాట్లు వేసే కూలీలతో మాట్లాడారు.అప్పటికే నాట్లు వేస్తున్న కూలీలను పలకరించి, వారితో కరచాలనం చేశారు.ఈ యాత్రలో ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్,జిల్లా కోశాధికారి రాంటెంకి నవీన్, నియోజకవర్గ అధ్యక్షుడు కొండా రాంప్రసాద్,మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి,దహేగాం మండల అధ్యక్షుడు దేవిడస్, మండల ప్రధాన కార్యదర్శి మహేందర్,దుర్గం గౌతమ్,గొర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.